నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య సోమవారం పోలీస్ కమిషనరేట్ ప్రధాన కార్యాలయం (హెడ్క్వార్టర్స్)తో పాటు అమరవీరుల స్థూపం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను క్షుణ్ణంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వేడుకల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పరిశీలించిన కమిషనర్ వేదిక నిర్మాణం, అతిథుల కూర్చునే ఏర్పాట్లు, పార్కింగ్ సదుపాయాలు, భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమం జరిగే ప్రదేశాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

అనంతరం అమరవీరుల స్థూపాన్ని సందర్శించి అక్కడ నిర్వహిస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఘన నివాళులు అర్పించే కార్యక్రమం గౌరవప్రదంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. స్థూపం పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత, భద్రత, ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ తరఫున అన్ని విధాల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్ పెక్టర్ శ్రీధర్ రెడ్డి, టౌన్ 4 ఎస్.హెచ్.ఓ సతీష్, నిజామాబాద్ నార్త్ తహసిల్దార్ వి.అనిల్, గిరిధర్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
