నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నిజామాబాద్ మాతా శిశు సంరక్షణ కేంద్రం నుంచి తప్పిపోయిన మూడేళ్ల బాలుడు వేదాన్ష్ కుటుంబాన్ని పోలీసు కమిషనర్ సాయిచైతన్య శనివారం రాత్రి పరామర్శించారు. బాల్కొండ మండలం నాగపూర్ గ్రామానికి చెందిన వేదాన్షు అనే చిన్నారి గుర్తుతెలియని మహిళ చేత అపహరణకు గురైన ఘటనపై నిజామాబాద్ పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించిందని సీపీ తెలిపారు. చిన్నారి కుటుంబ సభ్యులను స్వయంగా పరామర్శించి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారి తండ్రి నరేష్ తో పాటు కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి ఆందోళనను తెలుసుకున్నారు. చిన్నారి ఆచూకీ కోసం పోలీస్ శాఖ ఇప్పటికే చేపట్టిన చర్యలను కమిషనర్ సమీక్షించారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు,ఘటనకు సంబంధించిన ఇతర సమాచారాన్ని సమగ్రంగా విశ్లేషిస్తూ చిన్నారి ఆచూకీని త్వరితగతిన గుర్తించాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. అలాగే గుర్తుతెలియని మహిళను గుర్తించి, ఆమె ఆచూకీని తెలుసుకునేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేయాలని, చిన్నారి సురక్షితంగా కుటుంబ సభ్యుల వద్దకు చేరేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులకు సూచించారు. చిన్నారి కుటుంబ సభ్యులకు పోలీస్ కమిషనర్ ధైర్యం చెప్పి,చిన్నారి ఆచూకీ కోసం పోలీస్ శాఖ అన్ని విధాలుగా కృషి చేస్తుందని భరోసా కల్పించారు. ఘటనకు సంబంధించిన ప్రతి అంశాన్ని సీరియస్గా పరిగణిస్తూ దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.