నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా టౌన్ 2 పోలీస్ స్టేషన్ పరిధిలో ని హతాయి గల్లీ లో గల మజీద్ ఏ ఇస్లామీయ మసీద్లో మజీద్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఇఫ్తార్ విందు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.

కమిటీ నిర్వహించిన దువాలో సీపీ పాల్గొని, అనంతరం ఉపవాస విరమణ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ రంజాన్ మాసం విశిష్టతను విశ్లేషణాత్మకంగా వివరించారు. రంజాన్ అనేది కేవలం ఉపవాసాల నెల మాత్రమే కాకుండా, మనస్సును పరిశుభ్రం చేసుకునే ఆత్మపరిశీలన కాలమని అన్నారు. ఉపవాసం ద్వారా నియమం, సహనం, క్రమశిక్షణ పెంపొందుతాయని, పేదల పట్ల కరుణాభావం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. దానధర్మాలు, సహనశీలత, సోదరభావం వంటి విలువలు ఈ పవిత్ర మాసంలో మరింత ఆవిష్కృతమవుతాయని చెప్పారు. అల్లా కృపతో సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, సుఖసంతోషాలు నెలకొనాలని ఆకాంక్షించారు. అలాగే అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ముందుకు సాగి నిజామాబాద్ కు జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ కె ఉమారాణి, టౌన్ ఏసిపి ప్రకాష్, ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ, టౌన్ సిఐ శ్రీనివాస్ రాజ్, ట్రాఫిక్ సి.ఐ ప్రసాద్, టౌన్ 2 ఎస్. ఐ సయ్యద్ ముజహీద్ , మజీద్ అధ్యక్షులు మెహర్ అలీ ఖాన్, వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ యూసుఫ్, సెక్రటరీ అబ్దుల్ ఖదీర్, అబ్దుల్ మన్నం, అబ్దుల్ ఖయ్యూం, షాకీర్ ప్యారడైజ్ హోటల్ యాజమాన్య అల్తాఫ్ సేట్, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. సీపీ హాజరుకావడం పట్ల కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
