నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ఇందూరు నగర ఊరపండుగను పురస్కరించుకుని ఆదివారం నిర్వహించనున్న శోభాయాత్ర ఏర్పాట్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, భక్తులకు సౌకర్యాల కల్పనపై అధికారులకు పలు సూచనలు చేశారు. ముందుగా నగరంలో ఊరపండుగ సందర్భంగా ప్రతిష్ఠించనున్న అమ్మవారి విగ్రహాల తయారీ కేంద్రాలను, సంబంధిత రహదారులను కమిషనర్ సందర్శించారు. కళాకారులతో మాట్లాడి విగ్రహాల తయారీ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం శోభాయాత్ర నిర్వహించే మార్గాన్ని పరిశీలిస్తూ భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, బారికేడింగ్, ప్రజల రాకపోకల నిర్వహణపై అధికారులకు అవసరమైన మార్గదర్శకాలు అందించారు. తదనంతరం సిర్నపల్లి గడికి చేరుకున్న పోలీస్ కమిషనర్ అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించారు.

ఈ సందర్భంగా సర్వసమాజ సమితి సభ్యులతో సమావేశమై ఊరపండుగ నిర్వహణ, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, శాంతిభద్రతల అంశాలపై చర్చించారు. ఊరపండుగను ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. ఈ పర్యటనలో నిజామాబాద్ ఏసీపీ ప్రకాశ్ యాదవ్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, మలేష్, నిజామాబాద్ టౌన్ సీఐ శ్రీనివాసరాజ్, టౌన్-1 ఎస్హెచ్ఓ రఘుపతి, రూరల్ ఎస్హెచ్ఓ శ్రీనివాస్, టౌన్-4 ఎస్హెచ్ఓ సతీష్, టూ టౌన్ ఎస్ఐ యాదగిరి గౌడ్, సర్వసమాజ్ కన్వీనర్ రామర్థి గంగాధర్, కార్యదర్శి బంటు రాజేశ్వర్, సమితి సభ్యులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
