నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
సమ్మక్క సారక్క జాతర లో సి.పి.ఆర్ చేసి ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ దస్తయ్య, ట్రాఫిక్ రిజర్వ్ ఇన్స్ పెక్టర్ వినోద్ లను సోమవారం పోలీసు కమిషనర్ కార్యాలయంలో సీపీ పూల బొకే, శాలువాతో ఘనంగా సత్కరించారు. మేడారం సమ్మక్క సారక్క జాతర సందర్భంగా సిద్ధిపేట జిల్లా గుండ్ల చెరువు గ్రామానికి చెందిన శైలంద్ర సురేష్ అనే ప్రయాణికుడు తాడ్వాయి మండలం కాటాపూర్ క్రాస్ రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి అకస్మాత్తుగా అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. ఈ సంఘటనను గమనించి అక్కడే విధులు నిర్వహిస్తున్న నిజామాబాద్ జిల్లా కు చెందిన ట్రాఫిక్ ఎ.ఆర్ హెడ్ కానిస్టేబుల్ దస్తయ్య వెంటనే అప్రమత్తమై సీపీఆర్ నిర్వహించారు. అనంతరం కమ్యూనికేషన్ సెట్ హాస్పిటల్ కు తరలించడం కోసం సమాచారం ఇవ్వగా ట్రాఫిక్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ వినోద్ రెండు కిలోమీటర్ల దూరంలో గల అంబులెన్సును ట్రాఫిక్ రూట్ త్వరితగతిన మొత్తం క్లియర్ చేస్తూ అంబులెన్సు లో హుటాహుటిన ములుగు ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. వీరు సమయస్ఫూర్తి, మానవీయతతో చేసిన ప్రయత్నాల ఫలితంగా బాధితుడు ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడబడ్డాడు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ సహయ చర్యలు పోలీస్ శాఖ ప్రతిష్ఠను మరింత పెంచుతున్నాయని ప్రతి ఒక్కరూ హెడ్ కానిస్టేబుల్ దస్తయ్య, రిజర్వు ఇన్స్ పెక్టర్ వినోద్ లను సేవాస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ సన్మాన కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, పి. ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.
