నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతి మెడిసిన్ అండ్ సర్జరీ శిక్షణ పూర్తి చేసుకున్న రజనీకాంత్ ను పోలీసు కమిషనర్ సాయిచైతన్య అభినందించారు. సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రవికృష్ణ కుమారుడు రజనీకాంత్ బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతి మెడిసిన్ అండ్ సర్జరీ ( హోమియోపతి ) శిక్షణ పూర్తి చేసిన సందర్భంగా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం సీపీ సాయి చైతన్య అభినందించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగుల పిల్లలు ఉన్నత చదువులు చదివి, సమాజానికి ఉపయోగపడే వృత్తుల్లో స్థిరపడటం గర్వకారణమన్నారు. కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న రవి కృష్ణ కుమారుడు రజనీకాంత్ కష్టపడి చదివి హోమియోపతి డాక్టరుగా పట్టా పొందారన్నారు. కష్టపడి చదివి డాక్టరుగా ఎదిగిన రజనీకాంత్ ను ఆదర్శంగా తీసుకోవాలని, పోలీస్ సిబ్బంది పిల్లల చదువులకు తమ శాఖ నుంచి పూర్తి సహకారం ఉంటుందని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు.