. . . సీఎం ఆధ్వర్యంలో ఒప్పంద పత్రాల మార్పిడి
. . . సీఎస్ఆర్ కింద ముందుకు వచ్చిన సంస్థలను అభినందించిన సీఎం
హైదరాబాద్, బతుకమ్మ :
హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలో ప్రభుత్వ విద్యాభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టడానికి రహేజా గ్రూప్, రామ్కీ ఫౌండేషన్, యశోద ఫౌండేషన్లు ముందుకొచ్చాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ముందుకొచ్చిన ఈ సంస్థలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఒప్పందాలు చేసుకున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి తో జరిగిన సమావేశంలో రహేజా గ్రూప్ అధ్యక్షుడు నీల్ సి రహేజా, రామ్కీ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ అల్లా దాక్షాయణి, యశోదా గ్రూప్ డైరెక్టర్ గోరుకంటి దేవేందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యా శాఖతో కుదిరిన ఒప్పందాలను ముఖ్యమంత్రి సమక్షంలో పరస్పరం అందజేసుకున్నారు.

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్నగర్ ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు తరగతి గదుల కోసం కొత్త ప్రాంగణ నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చులో 40 శాతం మేరకు (రూ.19.66 కోట్లు) వెచ్చించడానికి రాంకీ సంస్థ ముందుకొచ్చింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ జడ్పిహెచ్ఎస్ ఉన్నతీకరణలో భాగంగా ప్రీ ప్రైమరీ నుంచి ఐదవ తరగతి, ఇంటర్ తరగతి గదుల నిర్మాణం కోసం మొత్తం వ్యయంలో 40 శాతం (రూ.10.4 కోట్లు) ఖర్చు చేయడానికి రాంకీ సంస్థ ఒప్పందం చేసుకుంది. రంగారెడ్డి జిల్లా కొండాపూర్లో ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు తరగతి గదుల నిర్మాణం కోసం అవసరమైన రూ.50.50 కోట్లు రహేజా గ్రూప్ ఖర్చు చేయడానికి ముందుకొచ్చి ఒప్పందం చేసుకుంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ సుభాష్నగర్ ఎంపీపీఎస్ లో ప్రీ-ప్రైమరీ, 6వ, 7వ తరగతి గదుల కోసం అవసరమైన రూ.12.20 కోట్లు యశోదా హాస్పటల్స్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఖర్చు చేయనున్నట్టు తెలిపింది. ఈ ఒప్పంద కార్యక్రమంలో విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ దేవసేన, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజిబిసి) చైర్మన్ సి శేఖర్ రెడ్డి పాల్గొన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద విద్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ముందుకొచ్చిన సంస్థలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు.
