. అభ్యంతరం చెప్పిన ఓ వర్గం
. నిరసన తెలిపిన మరో వర్గం
. ఇరువర్గాలను శాంతింపజేసిన పోలీసులు
ముప్కాల్, బతుకమ్మ: మండల కేంద్రంలోని మార్కెట్ ప్రాంతంలో శివాజీ విగ్రహ ఏర్పాటు పనులు వివాదాస్పదమయ్యాయి. గ్రామ కమిటీ ఆధ్వర్యంలో గత మూడు రోజుల క్రితం భూమి పూజ చేశారు. పాత జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న మార్కెట్ యార్డు స్థలం వద్ద శివాజీ విగ్రహం ఏర్పాటుపై ఆదివారం రోజు ఉదయం ఓ వర్గం అభ్యంతరం తెలిపింది. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామాభివృద్ధి కమిటీ, గ్రామస్తులు, శివాజీ యూత్ సభ్యులు అభ్యంతరం తెలిపిన వర్గం తీరుపై నిరసన తెలిపారు. ఏసీపీ బస్వారెడ్డి, సీఐ శ్రీధర్ రెడ్డి ప్రత్యేక, డిప్యూటీ తహసీల్దార్ శ్రీకాంత్ చొరవ తీసుకుని ఇరువర్గాల వారితో మాట్లాడి శాంతింపజేశారు. ఆయా పార్టీల నాయకులు, శివాజీ యూత్ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ పెద్దలు, మహిళలు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.