- బాన్సువాడ నియోజకవర్గంలో వర్గపోరు
- ఎంపీడీవోలదే రాజ్యం
- ఎలాంటి తీర్మానాలు చేయకుండానే పనులు అప్పగింత
బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ నియోజకవర్గంలో అధికారులు ఇష్టారాజ్యంగా తమకు నచ్చిన వాళ్లకే కాంట్రాక్ట్ లు కేటాయిస్తున్నారని ఓ వర్గం కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. శుక్రవారం నిజామాబాద్ కలెక్టరేట్ కు ఓ వర్గం కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చారు. కలెక్టరేట్లో కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో అదనపు కలెక్టర్ కిరణ్కుమార్కు తమ గోడు వెల్లబోసుకున్నారు.
- ఎంపీడీవోలదే రాజ్యం..
బాన్సువాడ నియోజకవర్గంలోని తొమ్మిది మండలాల్లో ఇటీవల ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులను ప్రభుత్వం కేటాయించింది. ఆయా పనులను చేయించేందుకు ఎంపీడీవో లకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ విషయంలో ఎంపీడీవోలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తమకు అనుకూలంగా ఉండే వారికే పనులు కేటాయిస్తున్నారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
- ఎలాంటి తీర్మానాలు చేయకుండానే..
ఎంపీడీవోలు వారి సంబంధిత ప్రాంతాల్లో గ్రామసభలను ఏర్పాటుచేసి తీర్మనాలు చేయాల్సి ఉంటుంది.సభల్లో పనుల జాబితా, ఆయా పనులు చేసే కాంట్రాక్టర్ల వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది.కానీ ఎలాంటి తీర్మానాలు లేకుండా ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు సమాచారం లేకుండానే పనులను తమకిష్టమైన వారికి కట్టబెడుతున్నారని మరోవర్గం కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
- బాన్సువాడ నియోజకవర్గంలో వర్గపోరు..
బాన్సువాడ నియోజకవర్గంలో వర్గపోరు తీవ్రస్థాయిలో ఉందని తెలుస్తోంది. ఇక్కడ బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన పోచారం శ్రీనివాస్రెడ్డి కాంగ్రెస్లో చేరారు.బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి ఏనుగు రవీందర్రెడ్డికి సైతం శ్రేణుల్లో పట్టు అంది. దీంతో ఈ ఇద్దరు నేతలకు చెందిన నాయకులు రెండు వర్గాలుగా ఏర్పడ్డారు.
