. . . పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
బోధన్, బతుకమ్మ :
డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక దాడులు నిరంతరం కొనసాగించాలని, అక్రమ రవాణాలో పాల్గొనే వారిపై పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాల కింద చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. బోధన్ డివిజన్ పరిధిలో నేరాల నియంత్రణ, పెండింగ్ కేసుల పురోగతి, శాంతిభద్రతల పరిరక్షణపై బుధవారం సమగ్ర సమీక్ష నిర్వహించారు. కోటగిరి పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ సమావేశంలో బోధన్ ఏసీపీ, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్హెచ్ఓలు, ఎస్సైలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పేకాట, గుట్కా, ఇసుక తదితర అక్రమ కార్యకలాపాలపై కూడా విస్తృతంగా దాడులు నిర్వహించాలని స్పష్టం చేశారు. సైబర్ నేరాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, ఆన్లైన్ మోసాలకు గురైన బాధితులకు తక్షణ సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టులపై నిఘా ఉంచి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

బోధన్ డివిజన్లో నమోదైన హత్య, హత్యాయత్నం, చోరీలు, మహిళలపై నేరాలు, సైబర్ మోసాలు, డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణా తదితర కేసుల పురోగతిని కమిషనర్ సమీక్షించారు. పెండింగ్ కేసులను వేగంగా దర్యాప్తు పూర్తి చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రౌడీషీటర్లు, పాత నేరస్థులు, బెయిల్పై విడుదలైన నిందితుల కదలికలపై నిరంతర నిఘా కొనసాగించాలని కమిషనర్ సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి గస్తీని మరింత బలోపేతం చేసి అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల తనిఖీలను కట్టుదిట్టం చేయాలని తెలిపారు. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, షీ టీమ్స్, ఈగల్ టీమ్స్, చీతా ఫోర్స్ మరింత సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యాసంస్థలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో పర్యవేక్షణ పెంచాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ ఆదేశించారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. హైవేలను కలుపుతున్న లింక్ రోడ్ల వద్ద అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయించడం, రహదారులకు అడ్డుగా ఉన్న పొదలను తొలగించేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. రోడ్డు ఇంజినీరింగ్లో లోపాలు ఉన్న ప్రాంతాలను గుర్తించి నేషనల్ హైవే, స్టేట్ హైవే అధికారులు, ఇతర సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతిరోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలని, ఓవర్స్పీడ్, ట్రిపుల్ డ్రైవింగ్, మైనర్లు వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలపై ప్రత్యేక డ్రైవ్లు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల్లో రోడ్డు భద్రతా నిబంధనలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు డయల్ 112 సేవలను వినియోగించుకునేలా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని కమిషనర్ సూచించారు. ఈ సేవల గురించి ప్రతి వర్గం ప్రజలకు అవగాహన కల్పించేలా పోలీస్ అధికారులు నిరంతరం కృషి చేయాలని అన్నారు.

రాబోయే పండుగలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వాహనాల తనిఖీలను 24 గంటలూ కొనసాగించాలని, తనిఖీల సమయంలో సిబ్బంది ఎలాంటి అలసత్వం ప్రదర్శించకూడదని స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్లలో ప్రజలకు స్నేహపూర్వక వాతావరణం కల్పించాలని, ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. రిసెప్షన్, రికార్డుల నిర్వహణ, స్టేషన్ పరిశుభ్రత, సిబ్బంది క్రమశిక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. సీసీ కెమెరాల వినియోగాన్ని మరింత విస్తరించి, నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలని అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా ప్రతి పోలీస్ అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బోధన్ ఏసీపీ పి.శ్రీనివాస్, సీసీఆర్బీ ఏసీపీ గురునాయుడు, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ ఆర్. అంజయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, సీఐలు, ఎస్హెచ్ఓలు, ఎస్సైలు, ఐటీ కోర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
