Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 July 2026, 7:52 pm Posted by : ramakrishna

ఎల్‌ నినో ప్రభావం నేపథ్యంలో ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించాలి

 

. . . ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఎల్‌ నినో కారణంగా రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ప్రణాళికల రూపకల్పనకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సూచించారు. శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల స్పెషల్ ఆఫీసర్లు, కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, సాగునీరు, విద్యుత్ రంగాల్లో తీసుకోవలసిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ నెల 20న జిల్లా ఇంచార్జి మంత్రి నేతృత్వంలో నిర్వహించే ఉమ్మడి జిల్లా సమావేశంలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులపై చర్చించి, ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో అవసరమైన చర్యలు తీసుకోవడానికి అన్ని శాఖలు ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని అన్నారు. ఎక్కడా తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజలు నుంచి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని, విద్యుత్ కోతలు లేకుండా నిరంతర విద్యుత్తు సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ ఇలా త్రిపాఠి, డీఆర్ఓ గీత, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డీఆర్డీఓ సాయన్న, జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

Contingency plans must be formulated in view of the impact of El Niño.