జుక్కల్, బతుకమ్మ :
జుక్కల్ మండల కేంద్రంలో ఎస్బీఐ బ్యాంక్ నుంచి సొసైటీ కార్యాలయం వరకు ఉన్న దెబ్బతిన్న రహదారిపై గ్రామ సర్పంచ్ సావిత్రి సాయి గౌడ్ ఆధ్వర్యంలో మొరం వేసి రాకపోకలకు అనుకూలంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా సర్పంచ్ సావిత్రి సాయి గౌడ్ మాట్లాడుతూ, రోడ్డు అధ్వాన్నంగా ఉండటంతో రైతులు, ప్రజలు, బ్యాంకు వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా సొసైటీ కార్యాలయానికి ఎరువులు, విత్తనాలు, ఇతర వ్యవసాయ అవసరాల కోసం వచ్చే రైతులు, అలాగే ఎస్బీఐ బ్యాంకుకు వెళ్లే ప్రజలకు ఈ మార్గం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. మొరం రోడ్డు ఏర్పాటు అనంతరం రాకపోకలు సులభతరమయ్యాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. గతంలో ఈ మార్గంలో ప్రయాణించడానికి ప్రజలు ఇబ్బందులు పడాల్సి వచ్చేదని, ఇప్పుడు పరిస్థితి మెరుగుపడిందని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధికి తమ పాలకవర్గం కట్టుబడి ఉందని సర్పంచ్ తెలిపారు. గ్రామంలో తాగునీటి సౌకర్యాల మెరుగుదల, రహదారుల అభివృద్ధి వంటి పలు పనులను చేపట్టినట్లు చెప్పారు. గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. స్థానికుల అభిప్రాయం ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, తాగునీటి సౌకర్యాలు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుండటంతో గ్రామాల అభివృద్ధి వేగవంతమవుతోందని తెలిపారు. అలాగే జుక్కల్ గ్రామంలో సర్పంచ్ సావిత్రి సాయి గౌడ్ నాయకత్వంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వారు పేర్కొన్నారు.