ఎల్లారెడ్డి, బతుకమ్మ :
గత ప్రభుత్వాలు చేయలేని అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపిస్తోందని ఎమ్మెల్యే మదన్ మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డి మున్సిపాలిటీ 12వ వార్డులో ఎమ్మెల్యే పర్యటించారు. పర్యటనలో భాగంగా 12వ వార్డులో కొనసాగుతున్న అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ పనుల పురోగతిని పరిశీలించి, నాణ్యతతో పాటు పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్లారెడ్డి పట్టణం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతోందని తెలిపారు. బస్ స్టాండ్ అభివృద్ధి, మినీ ట్యాంక్ బండ్, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, మార్కెట్లో షాపింగ్ కాంప్లెక్స్ ల నిర్మాణం వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు పట్టణంలో కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా, సేవాలాల్ జగదంబ మాత ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయం తప్పకుండా ఉంటుందని హామీ ఇచ్చారు. రాబోయే మూడు సంవత్సరాల్లో ఎల్లారెడ్డి పట్టణ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని అన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగుతాయని, ఎల్లారెడ్డి పట్టణాన్ని అన్ని రంగాల్లో ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు, స్థానిక ప్రజలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. వార్డులో మౌలిక వసతులు వేగంగా అభివృద్ధి చెందుతున్నందుకు స్థానిక ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కృషిని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, అధికారులు, పెద్ద సంఖ్యలో వార్డు ప్రజలు పాల్గొన్నారు.
