టిపిటిఎఫ్ డిమాండ్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : టిపిటిఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తమ న్యాయమైన డిమాండ్స్,సమస్యల పరిష్కారం కోసం గత 15 రోజులుగా నిరవధిక సమ్మెకు దిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల, ఉపాధ్యాయులందరి డిమాండ్లు వెంటనే నెరవేర్చాలని టిపిటిఎఫ్ సంఘ ఆధ్వర్యంలో ప్రచురించిన కరపత్రాలు నిరవధిక సమ్మె శిభిరం లో విడుదల చేసి మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు వెనిగళ్ళ సురేష్ మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు కోరుతున్నవి గొంతెమ్మ కోరికలు కాదని, సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు మాత్రమే ఆకాంక్షిస్తున్నారన్నారు. గత 20 సంవత్సరాలుగా విద్యాశాఖలో నామమాత్రపు వేతనాలతో చాకిరి చేసి జీవితాలను వెల్లదీస్తూన్నవారని అదే సందర్భంలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని ఇప్పుడు పట్టించుకోకుండా నిర్లక్ష్యం కాలయాపన చేయడం భావ్యం కాదని సానుకూల దృక్పథంతో సమస్యను పరిష్కరించే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని వారు కోరారు. మరోవైపు కేజీబీవిలలో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని వెంటనే వారి సమస్యలకు పరిష్కారం చూపిస్తూ సమ్మెకు తెర దించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి నిరవధిక సమ్మెను వెంటనే విరమింపచేయాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పి అరవింద్, సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘ నాయకులు రాజు, విజయ్, ఉపేందర్ గంగమణి సమగ్ర శిక్ష సిబ్బంది పాల్గొన్నారు.