. . . నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం
. . . నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నేరాల నిర్మూలన కోసం, శాంతి భద్రతల పరిరక్షణ, సెన్సాఫ్ సెక్యూరిటీ కల్పించడం కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ అన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు ఏసీపీ ప్రకాష్ పర్యవేక్షణలో బుధవారం ఇస్లాంపూర, ఖోజా కాలనీ ప్రాంతంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇళ్లలో తనిఖీలు నిర్వహించి 20 ద్విచక్ర వాహానాలను, 2 ఆటోలను సీజ్ చేసినట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ కాలనీలో ప్రజలందరి భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సీసీ కెమెరాలు ఉంటే నేరాలు చేయడానికి నేరస్తులు వెనకడుగు వేస్తారని ఆయనన్నారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు ముఖ్య పాత్ర పోషిస్తాయన్నారు. అలాగే కాలనీలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు ఇల్లు అద్దె కావాలని వస్తే వారి పూర్తి వివరాలు తీసుకున్నాకే అద్దెకి ఇవ్వాలన్నారు. ఒక వేళ ఏమైనా అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఈ తనిఖీలు నిర్వహించడం వలన నేరాల రేటు తగ్గుతుందని, ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చని ఆయన తెలిపారు. ఈ తనిఖీలలో టౌన్-1 ఇన్స్ పెక్టర్ బి.రఘుపతి, పోలీస్ అధికారులు, 70 మంది సిబ్బంది పాల్గొన్నారు.
