. . . వారం రోజులుగా ఇళ్లపై రాళ్లు.. భయాందోళనలో కోటగల్లి కాలనీవాసులు
. . . రాత్రివేళల్లో గుర్తుతెలియని వ్యక్తులే వేస్తున్నారని అనుమానం
. . . ఘటనాస్థలాన్ని పరిశీలించిన సీఐ తుల శ్రీధర్
బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణంలోని కోటగల్లి కాలనీలో వారం రోజులుగా ఇళ్లపై రాళ్లు పడుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. రాత్రి వేళల్లో గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు వేస్తున్నారనే ఆరోపణలతో కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఉన్న కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.స్థానికుల కథనం ప్రకారం.. రాత్రి సమయంలో అకస్మాత్తుగా ఇళ్లపై రాళ్లు పడుతున్న శబ్దాలు వినిపిస్తున్నాయి. కొన్ని ఇళ్లపై రాళ్లు పడటంతో పైకప్పులు, గోడలు, కిటికీలకు నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడిందని వారు తెలిపారు. చీకటిని ఆసరాగా చేసుకుని రాళ్లు వేసే వ్యక్తులు తప్పించుకుంటున్నారని కాలనీవాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో రాత్రి వేళల్లో బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. రాళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి?ఘటనలకు కారణం ఏమిటి? వీటి వెనుక ఎవరైనా వ్యక్తులు ఉన్నారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఈ క్రమంలో బాన్సువాడ పట్టణ సీఐ తుల శ్రీధర్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కాలనీవాసుల నుంచి వివరాలు సేకరించి, రాళ్లు పడుతున్న సమయం, దిశ, ఘటనలు చోటుచేసుకున్న ప్రాంతాలపై ఆరా తీశారు.