Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 March 2025, 10:15 pm Posted by : ramakrishna

పోలీసులకు కమిషనర్‌ సీరియస్ వార్నింగ్

  • సివిల్‌ తగాదాలు, సెటిల్‌మెంట్లకు పాల్పడితే ఉపేక్షించం
  • కానిస్టేబుల్‌ నుంచి ఏసీపీ వరకు అందరిపై నిఘా
  • నెలలో ఏసీపీ, ఐదుగురు ఇన్‌స్పెక్టర్‌లపై క్రమశిక్షణ చర్యలు
  • సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌

 

హైదరాబాద్, బతుకమ్మ : పోలీస్‌ స్టేషన్‌లలో సివిల్‌ పంచాయతీలు చేసినా కాసుల కోసం కేసులను పక్కదారిపట్టించి సెటిల్‌మెంట్లకు పాల్పడినా సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటానని సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ హెచ్చరించినట్లు తెలిసింది. కమిషనరేట్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ స్థాయి నుంచి ఏసీపీల వరకు ప్రతి అధికారిపై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు. ఇటీవల విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు ఎదుర్కొడమే కాకుండా మహిళా పోలీసులపట్ల అసభ్యంగా మాట్లాడిన బోరబండ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎస్‌హెచ్‌వో, డీఐ)లపై బదిలీ వేటు వేశారు. ఒకరిని ట్రాఫిక్‌ విభాగానికి, మరొకరిని మరో పోలీస్‌ స్టేషన్‌ డీఐగా బదిలీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.