. . . బిగాల గణేష్ గుప్తాపై అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఫైర్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:
కమిషన్ కరప్షన్ కలెక్షన్ కు అలవాటు పడి పదేళ్లు పాలించిన బిగాల గణేష్ గుప్తా అధికారం కోల్పోయిన తర్వాత అసహనంతో, అవగాహన లేకుండా తనపై ఆరోపణలు చేస్తున్నారని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఫైర్ అయ్యారు. గురువారం జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ధన్ పాల్ మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో అర్బన్ నియోజకవర్గం ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత మాజీ ఎమ్మెల్యే బిగాల నగరానికి ఎప్పుడో ఒకసారి వస్తున్నారన్నారు.. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 60 స్థానాల్లో ఒకటే సీటును గెలుపొంది, కనీసం ఆ ఒక్క సీటును కూడా కాపాడుకోలేని అసమర్ధత నాయకుడు అని ఆరోపించారు. బిగాల పదేళ్లు అధికారంలో ఉన్నా ..అర్బన్ నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా పేదలకు ఇప్పించలేదని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఉన్నాడని, అర్బన్ లో పేదలకు ఇండ్లు పంచనందుకే ఆయనకు రాజీనామా చేయమని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన టీ హబ్ లో ఒక్క ప్రముఖ కంపెనీ కూడా తీసుకు రాలేదు మరి కేటీఆర్ ని రాజీనామా చేయమని నిలదీశావా అని ప్రశ్నించారు. బిగాల గణేష్ గుప్తా కేవలం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి పని చేశావే తప్ప..నిజామాబాద్ అభివృద్ధి కాదని ఎద్దేవా చేశారు.. ఇటీవల తాను మంత్రులపై ఒత్తిడి తేవడంతో నగరంలో 396 ఇల్లు కేటాయించారన్నారు. నగరంలోని మినీ ట్యాంకుబండ్ మూసివేత పై బిగాల గణేష్ గుప్తా అవగాహన లేకుండా ఆరోపణలు చేస్తున్నారని ,ట్యాంక్ బండ్ నిర్వహణ కాంట్రాక్ట్ సమయం ముగియడంతో తాళాలు వేసి వెళ్లారన్నారు. కొత్త కాంట్రాక్టర్ నియమించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం, కార్పొరేషన్ పై ఉందన్నారు. అదే మినీ ట్యాంక్ బండ్ పై ఏర్పాటుచేసిన చెట్లలో అవినీతికి పాల్పడిన చరిత్ర బిగాల ది అన్నారు. నాలుగున్నర వేల ఒక్కో చెట్టును 45 వేలు చూపించి దోచుకున్నారన్నారు. అలాగే కార్పొరేషన్ లో ఒక్క మనిషి విధులు నిర్వహించుకున్నా.. 330 మంది పనిచేస్తున్నట్లు రికార్డుల్లో చూపించి నెలకు 50 లక్షలు దోచుకున్నారన్నారు. ఏ శాఖలో అయినా తాను ఒక్క రూపాయి అవినీతి చేసినట్లు నిరూపిస్తే బహిరంగ చర్చకు సిద్ధమని ఎమ్మెల్యే సవాల్ విసిరారు. నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో గల గణపతి ఆలయం ముందుకు తాను వస్తానని చెప్పారు. తన హయాంలో ఒక్క గుంట భూమి కొనుగోలు చేయలేదు, బిగాల మాత్రం ఒక్క గుంట కూడా విడిచి పెట్టలేదన్నారు.అలాగే ఆర్య వైశ్యులు అంటే దానధర్మాలకు ప్రతిక అని, కానీ బిగాల మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నారన్నారు. మరో వారంలో నగర అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ను కలుస్తున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే తెలిపారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి, బీజేపీ ఫ్లోర్ లీడర్ ప్రమోద్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతి, కార్పొరేటర్లు చింతకాయల రాజేందర్, మఠం పవన్, బంటు ప్రీతి , బొబ్బిలి సువర్ణ వేణుగోపాల్, కల్పే అర్చనా చిరంజీవి, మమత శివ, సీనియర్ నాయకులు న్యాలం రాజు, పుట్ట వీరేందర్, బీజేవైఎం రాష్ట్ర కో కార్యదర్శి విజయ్, ఇల్లెందుల ప్రభాకర్, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.
