Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 May 2025, 6:14 pm Posted by : ramakrishna

వ్యవసాయ శాఖ ఏడీఏ పై విచారణకు కమీషన్ నియామకం

  • ఏడీఏ పై చర్యలకు టీజీఓ ఆధ్వర్యంలో కలెక్టర్ కు ఫిర్యాదు
  • కమీషనర్ తో మాట్లాడి ఎంక్వైరీ కమీషన్ నియామకం
  • రేపు జిల్లాకు రానున్న కమీషన్ సభ్యులు

 

నిజామాబాద్, బతుకమ్మ: గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా విధి నిర్వహణలో గుండెపోటుతో మరణించిన ధర్పల్లి మండల వ్యవసాయ శాఖాధికారి ప్రవీణ్ కుటుంబానికి రావాల్సిన బెనిపిట్స్, కారుణ్య నియామకం విషయంలో సంబంధిత ఏడీఏ వ్యవహర శైలీపై జిల్లా గెజిటెడ్ ఉద్యోగుల సంఘం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకి ఫిర్యాదు చేసింది. గురువారం టీజీఓ అధ్యక్ష కార్యదర్శులు అలుక కిషన్, అమ్రుత్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మండల వ్యవసాయాధికారులు జిల్లా కలెక్టర్ ను కలిసి ఏడీఏ ప్రదీప్ పై ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వ్యవసాయ శాఖ కమీషనర్ కు ఫోన్ లో మాట్లాడి ప్రవీణ్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. అదేవిధంగా విధి నిర్వహణలో ఏఓ చనిపోతే అతని కుటుంబానికి ప్రభుత్వం ద్వారా అందే ప్రయోజనాలు అందించడంలో నిర్లక్ష్యంతో పాటు బాధిత కుటుంబంపై వేధింపులకు పాల్పడిన ఏడీఏ పై చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్, ఉద్యోగ సంఘాల ప్రాతినిధ్యం మేరకు రాష్ట్ర వ్యవసాయ కమీషనర్  ఎంక్వైరీ కమీషన్ నియామకం చేశారు. ప్రదీప్ పై విచారణకు అధికారులుగా వ్యవసాయ శాఖ జాయింట్  డైరెక్టర్ బి.సింగారెడ్డి, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ శివాజీ పాటిల్ ను కమీషన్ సభ్యులుగా నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులను జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి పంపించారు. ఈ నెల 16న నిజామాబాద్ జిల్లాలో పర్యటించి విచారణ నివేదికను సమర్పించాలని దాని ప్రకారం చర్యలు తీసుకుంటామని ఉత్తర్వులలో పేర్కొన్నారు.

Commission appointed to investigate Agriculture Department's ADA