Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 January 2026, 4:17 pm Posted by : ramakrishna

నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్

. . . ఎన్నికల విధులను పక్కాగా నిర్వహించాలని అధికారులకు దిశా నిర్దేశం

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఎన్నికల సంఘం నిబంధనలు పాటిస్తూ నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని, ఎన్నికల విధుల పట్ల జాగరూకతతో వ్యవహరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను కలెక్టర్ బుధవారం సందర్శించారు. నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోని కంటేశ్వర్ మున్సిపల్ జోన్ ఆఫీసు, టీటీడీ కల్యాణ మండపంలలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్, నామినేషన్ ఫారంలు, రిజిస్టర్లను పరిశీలించారు. అదేవిధంగా కామారెడ్డి జిల్లా ఇంచార్జి కలెక్టర్ గా కొనసాగుతున్న నేపథ్యంలో బాన్సువాడ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహిస్తున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను సైతం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మొదటి రోజు ఆయా డివిజన్లు, వార్డు స్థానాలకు దాఖలైన నామినేషన్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, అప్పీళ్ల పరిష్కారం, గుర్తుల కేటాయింపు, పోటి చేసే అభ్యర్థుల ప్రకటన తదితర ప్రక్రియలు పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Collector visits nomination centers

దాఖలైన నామినేషన్ల వివరాలను జాగ్రత్తగా పరిశీలించుకుని, వెంటవెంటనే రోజు వారీగా టీ.పోల్ యాప్ లో అప్లోడ్ చేయాలని అన్నారు. అభ్యర్థులు అన్ని వివరాలతో నామినేషన్ పత్రాలను దాఖలు చేసేలా హెల్ప్ డెస్క్ ద్వారా అవగాహన కల్పించాలని, వారి సందేహాలు నివృత్తి చేయాలని అన్నారు.  ఎన్నికల ప్రవర్తన నియమావళికి కట్టుబడి, మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు జరుగకుండా ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, క్షేత్ర స్థాయిలో ఎన్నికల సిబ్బంది పనితీరును పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ నెల 30వ తేదీ వరకు ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చని సూచించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయదలచిన అభ్యర్థులు సంబంధిత మున్సిపాలిటీ పరిధిలోని ఏదైనా డివిజన్/వార్డులో ఓటరుగా నమోదై ఉండవచ్చని సూచించారు. అయితే ప్రతిపాదకులు (ప్రపోజర్స్) మాత్రం అదే డివిజన్/వార్డు కు చెందిన ఓటరు అయి ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకొని అన్ని నామినేషన్ స్వీకరణ కేంద్రాలలో ఓటర్ల జాబితాలను అందుబాటులో ఉంచామని, నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలన జరిపేలా అవసరమైన సిబ్బందిని నియమించామని అన్నారు. ఎన్నికల సంఘం నియమ, నిబంధనలను పక్కాగా పాటిస్తూ పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని, ఎవరు కూడా ఎలాంటి అపోహలు, సందేహాలకు గురి కావద్దని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, బాన్సువాడ మున్సిపల్ కమిషనర్ శ్రీహరిరాజు తదితరులు ఉన్నారు.

 

 

Collector visits nomination centers