Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 February 2026, 6:18 pm Posted by : ramakrishna

భవిత కేంద్రాలను సందర్శించిన కలెక్టర్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

ఆర్మూర్, నందిపేట్ మండల కేంద్రాలలో గల భవిత సెంటర్లను కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం సందర్శించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం ఉద్దేశించిన ఈ కేంద్రాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అధికారులను ఆదేశించారు. ముందుగా ఆర్మూర్ పట్టణంలోని భవిత కేంద్రంను తనిఖీ చేసి, నిర్వహణ తీరుతెన్నులను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. చిన్నారులను కలెక్టర్ ఆప్యాయంగా పలకరించి కరచాలనం చేస్తూ, వారికి చాక్లెట్లు పంచి పెట్టారు. పిల్లల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, వారిని గాయపర్చే పదునైన వస్తువులు వంటివి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. యాక్టివిటీ రూమ్, థెరపీ రూమ్, టాయిలెట్స్, ఆఫీసు గదితో పాటు భవిత కేంద్రంలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం నందిపేట్ మండల కేంద్రంలో నిర్మాణం జరుగుతున్న భవిత సెంటర్ ను సందర్శించారు. పనులను వేగంగా, నాణ్యతతో జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. చిన్నారులకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ర్యాంపు వంటి వసతులు తప్పనిసరిగా ఉండాలని అన్నారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, జిల్లా విద్యా శాఖ అధికారి పి.అశోక్, ఇంజినీరింగ్ విభాగం అధికారులు జి.రవి, ఉదయ్ కిరణ్ తదితరులు ఉన్నారు.

 

Collector visits future centers