Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 February 2026, 5:01 pm Posted by : ramakrishna

ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమీక్ష

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులతో బుధవారం సమీక్ష జరిపారు. నగర పాలక సంస్థ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్, డిస్ట్రిబ్యూషన్, పోలింగ్ ఏర్పాట్ల గురించి కమిషనర్ దిలీప్ కుమార్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు ప్రక్రియ పూర్తయిన నేపధ్యంలో బ్యాలెట్ పేపర్లు, పోస్టల్ బ్యాలెట్ ముద్రణ గురించి ఆరా తీశారు. గోప్యతను పాటిస్తూ, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ముద్రణ జరిపించాలని, పోలీసు భద్రత మధ్యన స్ట్రాంగ్ రూమ్ లకు తరలించి జాగ్రత్తగా భద్రపరచాలని ఆదేశించారు. బ్యాలెట్ పత్రాల ముద్రణ పూర్తయిన మీదట వివరాలు ఎక్కడ కూడా బయటకు వెల్లడి కాకుండా చూడాలని, ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులు ముద్రణ అనంతరం సాఫ్ట్ కాపీలను పూర్తిస్థాయిలో హార్డ్ డిస్క్ నుండి కూడా తొలగించేలా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ విషయంలో నిబంధనలను ఉల్లంఘించే వారిపై ఎన్నికల సంఘం క్రిమినల్ చర్యలు చేపడుతుందని, దీనిని దృష్టిలో పెట్టుకుని బ్యాలెట్ పత్రాల ముద్రణ విషయంలో ఎంతో అప్రమత్తతో వ్యవహరించాలని అన్నారు. కాగా, పోలింగ్ కేంద్రాలలో కనీస సదుపాయాలను మరోమారు క్షేత్రస్థాయిలో సరిచూసుకోవాలని సూచించారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు అదనంగా పోలింగ్ సిబ్బందిని కేటాయిస్తున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల పరిధిలోని పోలింగ్ కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్ జరిపిస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు. పోలింగ్ ముగిసిన వెంటనే గట్టి బందోబస్తు మధ్యన బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ సెంటర్ కు తరలించేలా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఎలాంటి తప్పిదాలు, లోటుపాట్లకు తావులేకుండా, ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికలు జరిగేలా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమీక్షలో డీ.ఆర్.డీ.ఓ సాయాగౌడ్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

 

Collector reviews election preparations with officials