నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ నగరంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఆదివారం జిల్లా కేంద్రానికి విచ్చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, శాసన మండలి సభ్యులు బి. మహేశ్ కుమార్ గౌడ్ లతో జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి భేటీ అయ్యారు. రోడ్లు – భవనాల శాఖ అతిథి గృహం వద్ద వారికి పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం గెస్ట్ హౌస్ లో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ లతో కలెక్టర్ భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు. జిల్లా ప్రగతికి చేపట్టాల్సిన చర్యలు, కొత్త పరిశ్రమల స్థాపనకు అందుబాటులో ఉన్న అవకాశాలు తదితర విషయాలపై పరస్పరం తమ అభిప్రాయాలు పంచుకున్నారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి అధికార యంత్రాంగం చేపట్టే కార్యక్రమాలకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందేలా చూస్తామని షబ్బీర్ అలీ, మహేశ్ కుమార్ గౌడ్ లు తెలిపారు. ఈ భేటీలో రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ ఈరవత్రి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, నుడా ఛైర్మన్ కేశ వేణు, సహకార యునియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, నగర పాలక సంస్థ చైర్మన్ దిలీప్ కుమార్ తదితరులు ఉన్నారు.
