Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 November 2025, 4:48 pm Posted by : ramakrishna

జ్యోతిబాపూలే పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

నిజామాబాద్, బతుకమ్మ : డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామంలో గల మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, కోడి గుడ్లు, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి నిర్వాహకులకు సూచనలు చేశారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని, ఆహార పదార్థాలను భద్రపరిచే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం తయారు చేసేలా చూడాలన్నారు. భోజనం వండడానికి ముందే ఆహార పదార్థాల నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించాలని, కాలం చెల్లిన పదార్థాలు వినియోగించకూడదని సూచించారు. నాసిరకమైన బియ్యం, నూనె, ఇతర సరుకులు సరఫరా జరిగితే వెంటనే అధికారుల దృష్టికి తేవాలని, వాటి స్థానంలో నాణ్యమైన సరుకులను సమకూర్చేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు. నిర్లక్ష్యానికి తావివ్వకుండా, మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని సూచించారు. కలెక్టర్ వెంట తహసిల్దార్ సతీష్, పాఠశాల ప్రిన్సిపాల్ నరేందర్, స్థానిక అధికారులు ఉన్నారు.

Collector inspects Jyothibapule school