ఆర్మూర్, బతుకమ్మ :
ఆర్మూర్ మండలం గోవింద్ పేట్ లో గల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఆయా విభాగాలను సందర్శించి, రోగులకు అందిస్తున్న వైద్య సేవల తీరును గమనించారు. అందుబాటులో ఉన్న మందుల స్టాక్, వైద్యులు, సిబ్బంది హాజరును తనిఖీ చేశారు. వివిధ వార్డులను సందర్శించి రోగులకు కల్పిస్తున్న సదుపాయాలను గమనించారు. బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తూ, మధుమేహం, మలేరియా వంటి వ్యాధుల నిర్ధారణ, వాటి బారిన పడిన వారికి అందిస్తున్న చికిత్సల గురించి అడిగి తెలుసుకున్నారు. అన్ని రకాల ఔషధాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు.

పీ.హెచ్.సీ లో గురువారం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహిస్తున్న విషయం తెలుసుకున్న కలెక్టర్, ఆయా విభాగాలకు చెందిన ప్రత్యేక వైద్య నిపుణులు శిబిరానికి హాజరయ్యారా అని ఆరా తీశారు. ఈ తరహా ప్రత్యేక శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా ముందస్తుగానే సమాచారం చేరవేయాలని సూచించారు. ఆర్థోపెడిక్, గైనిక్, డెంటిస్ట్, జనరల్ ఫిజీషియన్ తదితర విభాగాల ద్వారా ప్రత్యేక శిబిరంలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలను కలెక్టర్ స్వయంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కస్తుర్బాగాంధీ, జ్యోతిబాపూలె విద్యాలయాలు, సంక్షేమ వసతి గృహాలలో కూడా క్రమం తప్పకుండా వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్దేశించిన కార్యక్రమాలను తు.చ తప్పకుండా పాటిస్తూ, ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ రాజశ్రీ తదితరులు ఉన్నారు.
