Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 September 2025, 2:20 pm Posted by : ramakrishna

ఎరువుల గోడౌన్, పల్లె దవాఖాన ను తనిఖీ చేసిన కలెక్టర్

నిజామాబాద్, బతుకమ్మ  : జక్రాన్ పల్లి, డిచ్ పల్లి మండలాల్లో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి బుధవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. డిచ్ పల్లి మండలం నడిపల్లి గ్రామంలోని పల్లె దవాఖానాను సందర్శించిన కలెక్టర్, ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది హాజరును తనిఖీ చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అంతకుముందు కలెక్టర్ జక్రాన్ పల్లి  మండలం పడకల్ గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎరువుల గోడౌన్ ను తనిఖీ చేశారు. గిడ్డంగిలో నిలువ ఉన్న ఎరువులను పరిశీలించారు. ఈ సీజన్ లో ఇంకా ఎంత మొత్తంలో యూరియా ఎరువుల అవసరం పడుతుందని ఆరా తీశారు. స్టాక్ కొంత మిగిలి ఉండగానే, ఇండెంట్ పెట్టి కొత్త స్టాక్ తెప్పించుకోవాలని మండల వ్యవసాయ అధికారిణి దేవికకు సూచించారు. ప్రస్తుత ఖరీఫ్ తరహాలోనే వచ్చే యాసంగి సీజన్ కు సంబంధించి కూడా ఎరువుల కొరత తలెత్తకుండా రైతుల అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉండేలా ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలన్నారు.  పడకల్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతి గురించి కలెక్టర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి రాకేష్ ను అడిగి తెలుసుకున్నారు. ఇల్లు మంజూరు అయిన లబ్ధిదారులు అందరూ నిర్మాణాలు చేపట్టేలా క్షేత్రస్థాయిలో పక్కాగా పర్యవేక్షణ జరపాలన్నారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు.

Collector inspects fertilizer godown and village hospital