Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 May 2025, 5:09 pm Posted by : ramakrishna

రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

  • ధాన్యం బస్తాల దిగుమతి, మిల్లింగ్ ప్రక్రియల పరిశీలన

 

నిజామాబాద్, బతుకమ్మ : జిల్లా కేంద్రానికి సమీపంలో గల అర్సపల్లి, ఖానాపూర్, సారంగాపూర్ ప్రాంతాలలోని రైస్ మిల్లులను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి అర్సపల్లిలోని రుద్రా రైస్ మిల్లును, ఖానాపూర్ లోని ఎల్.జీ ఆగ్రో ఇండస్ట్రీస్, వీరభద్ర రైస్ మిల్లు, సారంగాపూర్ లోని అనూ ఫుడ్స్ రైస్ మిల్లులను సందర్శించారు. ఆయా మిల్లులకు కొనుగోలు కేంద్రాల నుండి ఎన్ని లారీల ధాన్యం పంపించారు, వాటిని దిగుమతి చేసుకున్నారా, ఎంత పరిమాణంలో మిల్లింగ్ జరిపారు, మిల్లింగ్ చేసిన బియ్యాన్ని ఎలా భద్రపరుస్తున్నారు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. మిల్లుల వద్ద ఏమైనా తరుగు తీస్తున్నారా అని కలెక్టర్ ఆరా తీశారు. ముందస్తుగానే రుతు పవనాల ప్రవేశంతో వర్షాలు కురుస్తున్నందున ధాన్యాన్ని వెంటదివెంట దిగుమతి చేసుకోవాలని మిల్లర్లకు సూచించారు. ధాన్యం నిల్వలను సకాలంలో దించుకోకపోతే వర్షాల వల్ల తడిపోయే ప్రమాదం ఉంటుందన్నారు. ఇప్పటికే 90 శాతానికి పైగా ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తయ్యిందని, చివరి దశలో మిగిలిన ధాన్యం నిల్వలను కూడా సకాలంలో దిగుమతి చేసుకుని సామర్ధ్యం మేరకు పూర్తి స్థాయిలో మిల్లింగ్ చేయాలని హితవు పలికారు. మిల్లింగ్ చేసిన బియ్యాన్ని జాగ్రత్తగా భద్రపర్చాలని సూచించారు. మిల్లుల వద్ద ధాన్యం నిల్వలను దిగుమతి చేసుకునే విషయంలో నిర్లక్ష్యానికి తావులేకుండా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఎస్ఓ అరవింద్ రెడ్డి, సివిల్ సప్లైస్ డీ.ఎం శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Collector conducts surprise inspection of rice mills