- క్యూఆర్ కోడ్ ద్వారా ఫీడ్ బ్యాక్
- 9 నుంచి అమలు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : పోలీసు శాఖలో సంస్కరణల పర్వం కొనసాగుతుంది. ఇది వరకు పోలీసుల పనితీరుపై ఫిర్యాదుల పెట్టలను తర్వాత కాలంలో నేరుగా పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పించిన విషయం తెల్సిందే. గతంలో పోలీస్ స్టేషన్ లలో జరుగుతున్న వ్యవహరాలను నేరుగా డీజీపీ, పోలీసు కమిషనర్ కార్యాలయాలకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని అనుసంధానం చేసిన ఎలాంటి మార్పులు లేకపోవడంతో ఈసారి హైటెక్ పద్దతిని అవలంభించేందుకు సిద్దమైంది పోలీసు శాఖ. పోలీసు స్టేషన్ లలో ఫిర్యాదుదారుల నుంచి పోలీసు సిబ్బంది, అధికారులు స్పందించిన తీరుపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలని పోలీసు శాఖ నిర్ణయించింది. అందుకు గాను క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలని పోలీసు శాఖ ప్రయోగాన్ని చేపట్టింది. ఈ నెల 9న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్యూఆర్ కోడ్ ద్వారా ఫిర్యాదుదారుల అభిప్రాయాలను సేకరించే ప్రక్రియను డీజీపీ కార్యాలయం నుంచి ప్రారంభమౌతుంది. నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని అన్నీ పోలీస్ స్టేషన్ ల పరిధిలో ఫిర్యాదుదారుల నుంచి అభిప్రాయసేకరణ గురువారం ప్రారంభమౌతుందని ఇంచార్జి పోలీసు కమిషనర్ సింధూశర్మ తెలిపారు. ప్రజల సౌకర్యార్థం క్యూఆర్ కోడ్ పోస్టర్లను జనం రద్దీగా ఉండే ప్రాంతాలలో ఏర్పాటు చేయడం జరిగిందని దానిని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు.