నిజామాబాద్, బతుకమ్మ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ ఆకస్మిక పర్యటనపై చర్చ జరుగుతోంది. 2023లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటించిన విషయం తెలిసందే. అందులో భాగంగా రేవంత్ రెడ్డి మోపాల్ మండలంలో పర్యటించి ఇందూర్ తిరుమలను సందర్శించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని వేంకటేశ్వర స్వామిని మొక్కినట్లు తెలిసింది. ఇందూరు తిరుమల నిర్మాణ దాత దిల్ రాజుకు ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వ తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో ఇందూరు తిరుమలలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం స్వామి వారి కల్యాణం జరగనుంది. ఈ కల్యాణ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మొక్కు తీర్చుకోనున్నారు. శనివారం వరకు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై సందిగ్ధం నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి తమిళనాడు పర్యటన నేపథ్యంలో ఆయన రాకపై సందేహాలు వ్యక్తం అయ్యాయి. శనివారం రాత్రి సీఎంఓ నుంచి సీఎం పర్యటన గ్రీన్ సిగ్నల్ రావడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్పమత్తమై ఏర్పాట్లు చేసింది. సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పటికీ అధికార పర్యటలేవీ చేయలేదు. ఇందూరు తిరుమలకు సైతం వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు రావడం విశేషం.