వెబ్ న్యూస్, బతుకమ్మ : సావు భాష తప్ప సాగుపై సోయి లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే రైతుల బతుకులు క్యూ లైన్లలో తెల్లారాల్సిందే అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఈమేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ’ అందరినీ తొక్కుకుంటూ వచ్చాను అని గర్వంగా చెప్పుకునే రేవంత్ రెడ్డి, నీ చెత్త పాలనతో ఇప్పుడు రైతులనే తొక్కుతున్నావు. నీ చిల్లర రాజకీయాలకు, నీ విధ్వంసకర పాలనకు బలైపోతున్నది రైతే. రైతులకు సమయానికి యూరియా కూడా అందించలేని నువ్వు ముఖ్యమంత్రివా? యూరియా కొరత కనిపించకుండా మసిపూసి మారేడుకాయ చేయడానికి తెచ్చిన నీ యూరియా యాప్ ఏమైంది? యాసంగి సీజన్ ఆరంభంలోనే రైతులకు యూరియా కష్టాలు మొదలైతే, మీ ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? మీరు జూబ్లీహిల్స్ ప్యాలెస్లో కూర్చుంటే, రైతులు మాత్రం తెల్లవారుజాము నుంచే ఎముకలు కొరికే చలిలో చెప్పులు క్యూలో పెట్టుకుని యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. ఇదేనా మీరు చెప్పిన “మార్పు”. గత సీజన్లో ఎదురైన యూరియా కొరత చేదు అనుభవాల నుంచి కూడా మీ ప్రభుత్వం ఏమీ నేర్చుకోలేదా?. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం తెలంగాణలో యూరియా సమస్య తీరదా?‘ అని ’ఎక్స్‘ లో హరీశ్ రావు లో ట్వీట్ పెట్టారు. ఈట్వీట్ ను సీఎం రేవంత్ రెడ్డికి ట్యాగ్ చేశారు.
https://x.com/BRSHarish/status/2004423875799699858