Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 June 2026, 5:48 pm Posted by : ramakrishna

సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ మోహన్‌ చిత్ర పటాలకు పాలాభిషేకం

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్‌ చిత్ర పటాలకు ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు. ఇటీవల అడవి లింగాల గేట్, లింగంపల్లి ప్రాంతాల్లో అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న వంతెనల పునర్నిర్మాణానికి ప్రభుత్వం నుంచి సుమారు రూ. 8.5 కోట్ల నిధులు మంజూరు చేయించడంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ చేసిన కృషికి గుర్తింపుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొన్న కురిసిన అకాల వర్షాల వల్ల అడవి లింగాల గేట్ వద్ద, లింగంపల్లి వద్ద ఉన్న వంతెనలు తీవ్రంగా దెబ్బతిని ప్రజలు రాకపోకల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను గుర్తించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రత్యేక చొరవ తీసుకుని సంబంధిత అధికారులతో పాటు మంత్రులతో సమన్వయం చేసి ప్రభుత్వం నుంచి రూ. 8.5 కోట్ల నిధులు మంజూరు చేయించారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. దీంతో నూతన వంతెనల నిర్మాణానికి మార్గం సుగమమైందన్నారు. ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావిస్తూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, రవాణా సౌకర్యాల మెరుగుదల, ప్రజల భద్రతకు ఎమ్మెల్యే మదన్ మోహన్ నిరంతరం కృషి చేస్తున్నారని నాయకులు కొనియాడారు. అభివృద్ధి పనులకు నిధులు సమకూర్చడం, ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించడం, ప్రతి గ్రామం అభివృద్ధే లక్ష్యంగా పనిచేయడం ఆయన ప్రత్యేకత అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండే ఎమ్మెల్యే మదన్ మోహన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.