రుద్రూర్, బతుకమ్మ :
క్రీడాకారులను ప్రోత్సహించేందుకే సీఎం కప్ టోర్నమెంట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీఎం కప్ టోర్నమెంట్ పోటీలను గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్, తహశీల్దార్ తారాబాయి, ఎంపిడిఓ బాల గంగాధర్ స్థానిక మండల నాయకులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

అనంతరం క్రీడ పోటీల జెండా ఆవిష్కరించారు. ఈ సీఎం కప్ టోర్నమెంట్ లో వాలిబాల్, కబడ్డీ, ఖోఖో పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీలలో కేజీబివి పాఠశాల, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ ఉర్దూ మీడియం పాఠశాలల విద్యార్థులు, విద్యార్థినిలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సీఎం కప్ పోటీలను నిర్వహిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, మాజీ జడ్పిటీసి నారోజి గంగారాం, జహిరాబాద్ పార్లమెంట్ దిశ కమిటీ మెంబర్ నడిపింటి నగేష్, నాయకులు పత్తి రాము, తోట సంగయ్య, పత్తి లక్ష్మణ్, పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల బృందం, వివిధ పాఠశాలల పీఈటిలు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
