. . . నగర మేయర్ కూరగాయల ఉమారాణి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ నగర అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా నగర మేయర్ కూరగాయల ఉమారాణి, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ 3, 7, 39 డివిజన్లలో గురువారం విస్తృత పర్యటన నిర్వహించారు. స్థానిక ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకున్న వారు, అభివృద్ధి పనులు, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, రహదారుల పరిస్థితిని పరిశీలించారు. పర్యటన సందర్భంగా పలువురు స్థానికులు తమ ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి కొరత, డ్రైనేజీ కాలువల నిర్వహణలో లోపాలు, దెబ్బతిన్న రహదారులు, పారిశుద్ధ్య సమస్యలను మేయర్, కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు.

ప్రజల ఫిర్యాదులను ఓపికగా విన్న మేయర్ ఉమారాణి, సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించిన మేయర్, కమిషనర్ నగర పరిశుభ్రత విషయంలో రాజీపడబోమని స్పష్టం చేశారు. చెత్త సేకరణ, కాలువల శుభ్రత, దోమల నివారణ చర్యలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. తాగునీటి సరఫరాలో అంతరాయాలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని డ్రైనేజీ వ్యవస్థను పటిష్టం చేయాలని, నీటి నిల్వలు ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. దెబ్బతిన్న రహదారుల మరమ్మతులు, పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వడం నగర పాలక సంస్థ బాధ్యత అని అన్నారు. ప్రతి డివిజన్లో మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన పౌర సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. నగరాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కూడా కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ నజీర్, స్థానిక కార్పొరేటర్లు, వివిధ శాఖల మున్సిపల్ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు పాల్గొన్నారు. ప్రజల సమస్యలపై అధికారులు అక్కడికక్కడే స్పందించి పరిష్కార చర్యలు చేపట్టడం విశేషంగా నిలిచింది.
