. . . మెటా ఇండియా హెడ్ కేసు వివాదం
హైదరాబాద్, బతుకమ్మ :
మెటా సంస్థ ఇండియా హెడ్ను నిందితుడిగా చేర్చి కేసు నమోదు చేసిన వ్యవహారం జాతీయ స్థాయిలో వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబుపై తెలంగాణ ప్రభుత్వం వేటు వేసింది. నరేంద్ర మోడీ, ధర్మేంద్ర ప్రధాన్లను అవమానించేలా సోషల్ మీడియాలో పోస్టులు చేశారంటూ తెలంగాణ బీజేపీ నాయకులు చేసిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో సోషల్ మీడియా వేదికలైన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ల మాతృసంస్థ మెటా ఇండియా హెడ్ను కూడా నిందితుడిగా చేర్చడం తీవ్ర చర్చకు దారితీసింది. వ్యక్తిగత సోషల్ మీడియా వినియోగదారులు చేసిన పోస్టులకు మెటా సంస్థను ఎలా బాధ్యురాలిగా పరిగణిస్తారనే అంశంపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబును ప్రస్తుత బాధ్యతల నుంచి తప్పిస్తూ డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి రావడంతో అరవింద్ బాబు డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.