- సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఖలీల్
బతుకమ్మ, బాన్సువాడ : అంగన్వాడీ కేంద్రాల్లో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఖలీల్ డిమాండ్ చేశారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. అనంతరం కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అంగన్వాడీ కార్యకర్తలకు అన్నివిధాలుగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక పట్టించుకోవట్లేదన్నారు. అంగన్వాడీల్లో పదేళ్ల నుంచి వంటపాత్రలు కూడా ఇవ్వలేదని, పక్కా భవనాలు, మరుగుదొడ్లు, నీటి సౌకర్యం లేదని వినతిపత్రంలో పేర్కొన్నారు. అంగన్వాడీ పోస్టులు సైతం ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ప్రాజెక్ట్ అధ్యక్షురాలు మహాదేవి, శివగంగ, సెక్టర్ లీడర్ రేణుక, గౌరమ్మ, శివ జ్యోతి, సవిత తదితరులు పాల్గొన్నారు.