- గోవింద నామ స్మరణతో మార్మోగిన నింబాచలం
భీమ్గల్, బతుకమ్మ : నింబచల లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం నింబాచల గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నింబాచల గిరి ప్రదక్షిణ చేయడం ద్వారా మోక్షం తో పాటు కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు ప్రగాఢ నమ్మకం. లింబాద్రి గుట్టపై అక్టోబర్ 27 నుండి శ్రీ వారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతుందగా,అందులో భాగంగా శ్రీ లక్మీ నరసింహుని ఆయుధం అయిన శ్రీ చక్రస్వాముల(చక్రం) వారిని గిరి ప్రదక్షిణ గావించారు. శ్రీ వారి ఉత్సవ యాగ సంరక్షణమునకు శ్రీ చక్ర స్వాముల వారిచే నింబాద్రి కొండ ప్రదక్షిణ జరుపుతారు. ముందుగా ఆలయ అర్చకులు శ్రీ చక్ర స్వాముల వారిని పల్లకిలో పుష్పాలంకృతులను చేశారు. మేళతాళాలు, భాజ భజంత్రిలు, మంగళ హరతులతో సుహాసినిలు వెంటరాగ భగవంతుని భక్తి సంకీర్తనలతో భక్త జనులు గోవింద నామస్మరణ తో వెంట నడువగా కొండ ప్రదక్షిణ గావించారు. వేలాది మంది భక్తులు గోవింద నామ స్మరణ చేయగా నింబచల క్షేత్రం అడవులు, కొండలు పులకించి పోయాయి. నవాహ్నిక క్రియా రూపమున ప్రకాశించే ఇట్టి మహోత్సవము నందు సాక్షాత్తు శ్రీ లక్మీ నృసింహుని నివాస స్థలమైన నింబగిరి కొండపై జరిగిన శ్రీ చక్ర స్వాముల గిరి ప్రదక్షిణము చేయుటకు వచ్చిన భక్తుల జీవితం ధన్యం అయ్యింది. గిరి ప్రదక్షిణ చేసిన భక్తుల మనోబిష్టము లను ఆ లక్మీ నృసింహుడు నేర వేర్చి ఆయురారోగ్యాలు, సంపాదన చేకూర్చుతాడని భక్తుల నమ్మకం.

తులసి వివాహం..
స్వామి యోగ నిద్ర నుండి మేల్కొనిన పర్వదినం పురస్కరించుకొని కొండ పై విష్ణు ప్రభోదోత్సవం తో పాటు శ్రీ తులసి వివాహంను అర్చకులు నిర్వహించారు.మొదట తులసి, విష్ణువు కు ఆసనాది మంత్ర పుష్పాంతము వరకు షోడశోపచార పూజ నొసంగి, వాధ్య ఘోషములచే స్వామి ని మేల్కొలిపారు. స్వామి ని ప్రార్తించి పుష్పాంజలి సమర్పించారు. తదుపరి శాస్త్ర విధిగా తులసీ, విష్ణువు ల వివాహం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం సందర్బంగా భీమ్ గల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ కు బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఎస్సై సందీప్ తో పాటు సివిల్ పోలీసులు, మహిళ పోలీసులు బందోబస్త్ లో పాల్గొన్నారు.
