👉 నిషేధం ఉన్న ఎగురుతున్న డ్రోన్లు
👉 నిజామాబాద్ నగరంలో కలకలం
నిజామాబాద్ క్రైo, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రోన్ల ఎగరవేయడానికి నిషేధిస్తూ ఉత్తర్వులు అమలు అవుతున్నాయి. గత పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తో పాటు ప్రస్తుత ఇంచార్జి కమిషనర్ సింధు శర్మ అవే ఉత్తర్వులను అమలు చేస్తున్నారు. డ్రోన్లను ఎగురవేయాలంటే కచ్చితంగా అనుమతులు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ నిజామాబాద్ నగర నడిబొడ్డున డ్రోన్లు తిరుగుతూ కలకలం రేపుతున్నాయి. మొన్నటి వరకు జరిగిన పండగల సందర్భంగా శాంతిభద్రతల పర్యవేక్షణకు పోలీస్ శాఖ వారు డ్రోన్ల ద్వారా నిఘాను పర్యవేక్షణ చేశారు. కానీ సోమవారం రాత్రి నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం, మున్సిపల్ కార్పొరేషన్, నుడా కార్యాలయం, ధర్నా చౌక్, కోర్టు చౌరస్తా, ఎల్లమ్మ గుట్ట చౌరస్తాలో డ్రోన్లు ఎగురుతూ కలకలం రేపాయి. వాటిని పోలీసు అధికారులు ఎగరవేస్తున్నారా లేక ప్రైవేట్ వ్యక్తులు ఎగరవేస్తున్నారన్న సమస్యలు వ్యక్తం అవుతున్నాయి. రాత్రివేళ తిరుగుతున్న డ్రోన్లు అందరి దృష్టిని ఆకర్షించాయి. దానిపై అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో మళ్లీ వీడియో రికార్డింగ్ కోసం డ్రోన్ల వినియోగిస్తున్నారు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డ్రోన్ల వినియోగంపై పోలీసు అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.