. . . కలెక్టరేట్ లో ప్రధానోపాధ్యాయులతో సమీక్ష
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
జిల్లాలో పీఎం శ్రీ నిధులు మంజూరైన పాఠశాలలను సెంట్రల్ నోడల్ అబ్జర్వర్ దేవేంద్ర కుమార్ రాయ్ (జాయింట్ సెక్రెటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలి కమ్యూనికేషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా) క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పీఎం శ్రీ నిధులతో కంజర, నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయం పాఠశాలలలో చేపడుతున్న పనులను, జరుగుతున్న కార్యక్రమాలను పరిశీలించారు. ఈ నేపధ్యంలో శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి పీఎం శ్రీ నిధులు మంజూరు చేసిన 40 పాఠశాలలకు చెందినా ప్రధానోపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. పీఎం శ్రీ పాఠశాలలలో నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల గురించి జిల్లా విద్యా శాఖ అధికారి అశోక్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. సెంట్రల్ నోడల్ అబ్జర్వర్ దేవేంద్ర కుమార్ మాట్లాడుతూ, పీఎం శ్రీ కార్యక్రమాల అమలు పట్ల పాఠశాలల్లో ఉపాధ్యాయులు శ్రద్ధ కనబరుస్తున్నారని అభినందించారు.

విద్యార్థులు కార్యక్రమాల పట్ల ఆకర్షితులై ప్రగతిని కనబరుస్తున్నారని, ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తన పరిశీలనలో గమనించినట్లు పేర్కొన్నారు. పాఠశాలలో పరిశుభ్రత, కిచెన్ గార్డెన్ల నిర్వహణ ఎంతో బాగుందని సంతృప్తి వెలిబుచ్చారు. కార్యక్రమాలను ఉపాధ్యాయులు అందరూ వారి వారి సామర్ధ్యాలు ఇష్టాలకు అనుగుణంగా బాధ్యతలు తీసుకొని సమన్వయంతో పని చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలు సాధించబడతాయని సూచించారు. పాఠశాలలో నిర్వహించే కార్యక్రమాల అమలు కోసం సమయం ఇచ్చినట్లయితే సరైన విధంగా ప్లాన్ చేసుకొని ఇంకా మంచి ఫలితాలు సాధించగలుగుతామని హెడ్ మాస్టర్ లు అభిప్రాయాలను వెలిబుచ్చారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, సెంట్రల్ అబ్జర్వర్ పాఠశాలలలో కార్యక్రమాల అమలు తీరును పరిశీలించి అభినందించడం సంతోషంగా ఉందని, ఈ స్ఫూర్తిని కొనసాగించడానికి జిల్లా విద్యాశాఖకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తామని అన్నారు. గత ఏడాది పదవ తరగతి వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించిన పాఠశాలల హెచ్.ఎంలను ఈ సందర్భంగా అభినందించారు. పీఎం శ్రీ పాఠశాలల హెచ్.ఎంలు, ఉపాధ్యాయులు చేస్తున్న కృషి వల్ల విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐ.టీ, ఇతర ప్రతిష్టాత్మక విద్యాసంస్థలలో ప్రవేశాలు సాధిస్తున్నారని అన్నారు. ఇదే స్పూర్తిని కొనసాగించాలని, పీఎం శ్రీ నిధులను పూర్తి స్థాయిలో వినియోగిస్తూ బడులలో సదుపాయాలను పెంపొందించాలని సూచించారు. సమీక్ష సమావేశంలో పాఠశాల విద్యాశాఖ ఆర్.జే.డీ విజయలక్ష్మి బాయి, రాష్ట్ర అకాడమిక్ మానిటింగ్ ఆఫీసర్ శ్రీనాథ్, ఏ.డి.నాగజ్యోతి, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.
