Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 March 2025, 8:58 pm Posted by : ramakrishna

వక్ఫ్ బోర్డుపై కేంద్ర ప్రభుత్వం కుట్ర

  • ముస్లిం మత పెద్దలు తీవ్ర ఆగ్రహం

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : వక్ఫ్ బోర్డుపై కేంద్ర ప్రభుత్వం తన  పెత్తనం చలయించడానికి  కుట్ర పన్నుతోందని ముస్లిం మత సంస్థల నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.వక్ఫ్ బోర్డులో సవరణల పేరుతో ముస్లింల ఆస్తులపై హక్కును క్రమంగా బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నదని ముస్లిం పండితులు ఆరోపించారు. సోమవారం ముస్లిం పర్సనల్ లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ ధర్నా చౌక్‌లో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముస్లిం మత సంస్థల నేతలతో పాటు  మాల మహానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ నిరాడి లక్ష్మణ్ కూడా పాల్గొని ముస్లింల హక్కులను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వివిధ సంఘాల  మత నాయకులు మాట్లాడుతూ, “వక్ఫ్ బోర్డు అనేది ముస్లింల ధార్మిక, సామాజిక, విద్యా ప్రయోజనాల కోసం ఏర్పాటు చేయబడిందన్నారు. దీనిపై ప్రభుత్వ జోక్యం అసలు ఆమోదయోగ్యం కాదని. మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం” అని స్పష్టం చేశారు. “భారతదేశం మత స్వేచ్ఛకు ప్రాతినిధ్యం వహించే దేశం. అయితే, కేంద్ర ప్రభుత్వం ముస్లిం ఆస్తులను లూటీ చేసేందుకు సవరణలు తెచ్చే ప్రయత్నం చేస్తోంది. మేము దీన్ని సహించము” అని ముస్లిం పర్సనల్ లా కమిటీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఈ రోజు దేశవ్యాప్తంగా ముస్లిం సంఘాలు, మత  సంస్థలు నిరసనలు చేపట్టాయి. ఢిల్లీ నుండి గ్రామాల వరకు అన్ని చోట్ల ముస్లింల హక్కుల పరిరక్షణ కోసం పోరాటం కొనసాగుతోంది. ప్రభుత్వం వెనుకడుగు వేయకుంటే మేము దీన్ని మరింత ఉధృతం చేస్తాం” అని నేతలు హెచ్చరించారు. “ప్రభుత్వం వక్ఫ్ బోర్డుపై సవరణల నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి. లేకపోతే మేము దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు, ర్యాలీలు నిర్వహించాల్సి వస్తుంది” అని ముస్లిం మతపై నేతలు హెచ్చరించారు. వక్ఫ్ బోర్డును పరిరక్షించేందుకు ముస్లిం మత సంస్థలు ఐక్యంగా పోరాడతాయని, ప్రభుత్వం మైనారిటీల హక్కులను కాపాడే బాధ్యతను విస్మరించకూడదని మతపై ప్రతినిధులు గట్టిగా హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ముస్లిం పర్సనల్ లా కమిటీ సభ్యులు, వివిధ  మత సంఘాల నేతలు, సామాజిక హక్కుల సంఘాల ప్రతినిధులు,  తదితరులు పాల్గొన్నారు.