. . . 15 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం
. . . పోలీస్ కమీషనర్ సాయిచైతన్య వెల్లడి
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచిన వారిపై సీసీఎస్ బృందం మెరుపు దాడి చేసి గురువారం 15 క్వింటాళ్ళ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని 5వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అజామ్ కాలనీలో పీడీఎస్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచడంతో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు సిసిఎస్ ఏసీపీ శ్రీశైలం పర్యవేక్షణలో సీసీఎస్ ఇన్స్పెక్టర్ డి. సాయినాథ్, ఎస్ఐ మహేష్, సిబ్బంది మెరుపు దాడి నిర్వహించారు. దళారుల ద్వారా పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసిన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి,ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ఒక ఇంట్లో నిల్వ ఉంచినట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలు చేపట్టగా సుమారు 15 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ఈ వ్యవహారంలో అక్రమంగా బియ్యం నిల్వ చేసిన రెహాన్ ను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు మోసిన్ పరారీలో ఉండగా అతనిపై కూడా కేసు నమోదు చేసేందుకు తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం ఐదవ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓకు కేసును అప్పగించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా పేదలకు అందించే పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేయడం, నిల్వ చేయడం, తరలించడం లేదా విక్రయించడం చట్టరీత్యా శిక్షార్హమైన నేరమని నిజామాబాద్ పోలీసులు హెచ్చరించారు. ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై ప్రజలు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని కోరారు.