- సీసీఎస్ ఎస్ఐకి గాయాలు
- నిజామాబాద్ నగరంలో ఘటన
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. మహమ్మదీయ నగర్ కాలనీకి చెందిన పాత నేరస్తుడు రియాజ్ అరబ్ సీసీఎస్ పోలీసులు పట్టుకుని స్టేషన్ కు తరలిస్తుండగా పోలీసులను కత్తితో పొడిచి గాయపరిచాడు. ఈ దాడిలో గాయపడ్డ సీసీఎస్ కానిస్టేబుల్ ను పోలీస్ వాహనంలో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. ఈ ఘటనలో సీసీఎస్ ఎస్ఐకి కూడా గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. నగరంలోని మహమ్మదీయ నగర్ కాలనీకి చెందిన రియాజ్ పలు దొంగతనాల కేసులో పాతనేరస్తుడు. నగరంలోని సీసీఎస్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ విధులు నిర్వహిస్తున్న విఠల్ తో పాటు సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ లు పాత నేరస్తుడు రియాజ్ ను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. రిజాయ్ ను స్టేషన్ కు తరలించేందుకు ప్రమోద్ బైక్ నడుపుతుండగా నేరస్థుడు వెనుక కూచున్నాడు. వారిద్దరిని మరో బైక్ లో ఎస్ఐ ఫాలో చేస్తుండగా వినాయక్ నగర్ ప్రాంతంలో రియాజ్ తన వద్ద ఉన్న కత్తితో ప్రమోద్ ను పలు మార్లు పొడిచాడు.. అతన్ని అడ్డుకోవడానికి వెళ్లిన ఎస్ఐ పై దాడి చేసి పరారయ్యాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ప్రమోద్ ను అదే రోడ్ లో వెళ్తున్న మోపాల్ ఎస్ఐ తన వాహనంలో జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ మృతి చెందాడు. సీసీఎస్ ఎస్ఐ విఠల్ ఆరోగ్య పరిస్థతి నిలకడగానే ఉందని తెలిసింది. ఇటీవల బదిలీలో సీసీఎస్ కానిస్టేబల్ ప్రమోద్ ట్రాఫిక్ నుంచి సీసీఎస్ కు బదిలీపై వచ్చినట్లు సమాచారం. అతని సోదరుడు కూడా పోలీస్ శాఖలో పని చేస్తున్నారు. నేరస్తుడి దాడిలో సీసీఎస్ కానిస్టేబుల్ మృతి చెందడంతో పోలీస్ శాఖ అప్రమత్తం అయింది. పరారీలో ఉన్న నిందితుడు రియాజ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రియాజ్ సమద్ అనే గ్యాంగ్ కు చెందిన సభ్యుడని తెలిసింది. రియాజ్ పై దొంగతనాలు, హత్య కేసులు, చైన్ స్నాచింగ్ కేసులు పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం.
