- బీఆర్ఎస్ లీగల్ సెల్ కన్వీనర్ దాదాన్నగారి మధుసుధన్ రావు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ ప్రజల కల్పతరువుగా నిర్మించిన కాళేశ్వరం నీటి ప్రాజెక్టును నీరుగార్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహారిస్తోందని నిజామాబాద్ జిల్లా భారత రాష్ట్ర సమితి లీగల్ సెల్ కన్వీనర్ దాదాన్నగారి మధుసుధన్ రావు ఆరోపించారు. పీసి ఘోస్ కమిషన్ నివేదికపై విచారణకు కేంద్ర ప్రభుత్వ అజమాయిసిలోని దర్యాప్తు సంస్థ సీబిఐ కి అప్పగించడంలోనే కుట్రల కుట్రదారులు ప్రజల ముంగిట బయట పడ్డారని ఆయన తెలిపారు. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి కుట్ర శాసన సభ సాక్షిగా ప్రజల ముంగిటికి వచ్చిందని, ప్రజలు కుట్రదారుల సంబంధాలను గమనిస్తున్నారని మధు పేర్కొన్నారు. కలుగులో ఉన్న కాంగ్రెస్, భాజపా నాయకుల రహస్య బంధం బయట పడి అసలైన దోషులుగా ప్రజల ముందు బహిర్గతమయ్యారని వెల్లడించారు. కాళేశ్వరంతో గలగల తెలంగాణ పంట పొలాలకు పారే గోదావరి జాలాలను ఆంధ్రప్రదేశ్ వైపు మరలించడానికి కాంగ్రెస్, భాజపా కలిసి ఆడుతున్న విషపు క్రీడలో భాగమే సీబిఐ విచారణ అని ఆయన వివరించారు.కుట్రలు జేసేటోళ్లు కుట్రలకే బలైతరని, కష్టానష్టాలకు ఓర్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన భారాస అధినేతకు కేసీఆర్ కు కుట్రదారుల కుట్రలను తిప్పికొట్టే శక్తి ఉన్నదని ఆయన తెలిపారు. కాంగ్రెస్, భాజపా ల ఎత్తుగడలను చిత్తుచేసి కాళేశ్వరం ప్రాజెక్టు నీటిలో ముంచివేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. తెలంగాణ ప్రజల ఆశీస్సులు కేసీఆర్ వెంట ఉన్నాయని, ప్రజాబలమే కేసీఆర్ కు పెట్టనికోటల రక్షణనిస్తుందని మధు పేర్కొన్నారు.