- ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
కామారెడ్డి, బతుకమ్మ : కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన నిర్వహించి దేశానికే ఆదర్శంగా నిలిచిందని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు అధ్యక్షతన శుక్రవారం జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలు మనల్ని నాయకులుగా ఉన్నందుకు ప్రజల సమస్యలు తీర్చడానికే ఎక్కువ సమయం ఇవ్వాలని, అప్పుడే ప్రజా నాయకులం అవుతాం తప్ప పదవుల కోసం పాకులాడితే కుదరదని అన్నారు. బిఆర్ఎస్ , బీజేపీ జిల్లాకు చేసిందేమీ లేదని ఇవన్నీ మనం ప్రజలకు చెప్పాలని సూచించారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు త్రాగు సాగు నీరు అందాలని ప్యాకేజ్ 21,22,23 ప్రాజెక్టు తీసుకువస్తే దానిని వారి స్వార్థాల కోసం ఆపారని తెలిపారు.

300 కోట్లతో అయిపోయే పనిని 3000 కోట్లు పెట్టీ కాంట్రాక్టులకు ఇచ్చారని అన్నారు. చిన్న చిన్న గొడవలు పక్కన పెట్టీ రాబోయే ఎన్నికల్లో ముందుకు వెళ్ళాలన్నారు. ప్రజలకు సేవ చేసే విధంగా కాంగ్రెస్ నాయకులు లక్ష్యం పెట్టుకోవాలని తెలిపారు. యంత్రాంగం లో జరిగే తప్పులను సరిచేస్తూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. కార్యకర్తలు ఐక్యంగా ఉంటే అందరికీ పదవులు ఇచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. ఇన్ని రోజులు కార్యకర్తలు మన గెలుపు కోసం కష్టపడ్డారు ఇప్పుడు వారి రుణం తీర్చుకోవడానికి సమయం ఆసన్నమైందని వారికోసం పనిచేసి వారిని గెలిపించి నాయకులు గా తీర్చిదిద్దుతామని తెలిపారు. జిల్లాలో క్రమపద్ధతిలో నీళ్లు నిల్వ చేస్తూ పంటలు పండిస్తున్నామన్నారు. ఏఐసీసీ ఆదేశాలు మేరకు గ్రామ,మండల,బ్లాక్ కమిటీలు ఏర్పాటుకు అందరూ సహకరించాలని కోరారు. కార్యకర్తలకు బాధ్యతలు,పదవులు ఇవ్వడమే మా లక్ష్యమని తెలిపారు. భూ భారతీ ద్వారా రైతుల సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలిపారు. కేసార్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో కమిషన్లు తిన్నారని అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నియోజకవర్గానికి 3500 ఇళ్లు ఇస్తుందన్నారు. ఒక్కొక నియోజకవర్గానికి 10000 ఇల్లు ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధంగా ఉందని అన్నారు. మన వాళ్ళు వేరే వాళ్ళు అనే తేడా లేకుండా ప్రతి పేదవాడికి ఇల్లు అందిస్తామని, ఇల్లు నిర్మాణ పనులను బట్టి నిధులు మంజూరు అవుతాయని తెలిపారు. జై బాపు జై భీం జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమము గ్రామ గ్రామాన తీసుకు వెళ్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఇంకా గట్టిగా ప్రజల్లోకి తీసుకుపోవాలని కోరారు. పాత కొత్త అనే తేడా ఉండకూడదని, పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత మనపైన ఉందని తెలిపారు. ఎవరైతే కింది స్థాయిలో పార్టీ జెండా మోసి బలోపేతానికి పనిచేశారో వారిని గుర్తించి వారికి పదవులు ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి. ఆగ్రో పరిశ్రమల రాష్ట్ర చైర్మన్ కాసుల బాలరాజ్. జిల్లా ఇన్చార్జ్ లు. సత్యనారాయణ గౌడ్. వేణుగోపాల్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అనుబంధ సంఘాల ప్రెసిడెంట్లు, మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, మాజీ జెడ్పిటిసి లు మాజీ ఎంపీటీసీలు సర్పంచులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
