నిజామాబాద్ క్రైమ్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో పలు దొంగతనాలు చైన్ స్నాచింగ్ కేసులలో నమోదైన పాత నేరస్తుడు షేక్ రియాజ్ ను పట్టిస్తే రూ. 50 వేల క్యాష్ రివార్డ్ ఇస్తామని పోలీసు కమిషనర్ సాయి చైతన్య ప్రకటించారు. ఈ మేరకు శనివారం నిందితుడి వాంటెడ్ పోస్టర్లను విడుదల చేశారు. గత కొంతకాలంగా దొంగతనాల కేసులు నమోదై తప్పించుకు తిరుగుతున్న రియాజ్ ను శుక్రవారం సీసీఎస్ పోలీసులు పట్టుకొని విచారణకు తరలిస్తుండగా వారిపై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. ఈ ఘటనలో సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ మృతి చెందగా, ఎస్సై, హెడ్ కానిస్టేబుల్ కు మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో రియాజ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రియాజ్ ని పట్టించిన వారికి నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు.