ఎల్లారెడ్డి, బతుకమ్మ :
ఎల్లారెడ్డి మండల కేంద్రానికి చెందిన జనుముల భూమయ్య నాలుగు నెలల క్రితం ఎల్లారెడ్డి శివారులో ఉన్న భూమిని అగల్ దివిటి సంగమ్మ నుండి కొనుగోలు చేశాడు. అయితే ఆ భూమి విషయంలో గతంలో సంగమ్మ కుటుంబ సభ్యులు, ఆమె పక్క పొలం యజమాని రోడ్డ నరేష్, అతని తండ్రి నరసింహులు మధ్య వివాదాలు జరిగినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, భూమయ్య తన వ్యవసాయ పనుల కోసం ఒక ట్రాక్టర్ కొనుగోలు చేసి, తాను కొనుగోలు చేసిన వ్యవసాయ భూమి పక్కనే ఉన్న తన సొంత పొలంలో 2025 జనవరి 5 న సాయంత్రం సుమారు 6.00 గంటలకు ట్రాక్టర్ను ఉంచి వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం సుమారు 8.00 గంటలకు పొలానికి వెళ్లి ట్రాక్టర్ స్టార్ట్ చేసి నడపగా అది ఒక్కసారిగా ఆగిపోయింది. దీనిపై మెకానిక్కు చూపించగా ట్రాక్టర్ ఇంజన్లో ఇసుక నింపబడినట్లు గుర్తించారు. భూమయ్య తెలిపిన వివరాల ప్రకారం, తాను సంగమ్మ భూమిని కొనుగోలు చేసిన విషయం నచ్చక నరేష్, అతని తండ్రి నరసింహులు రాత్రి సమయంలో తన పొలంలో ఎవరూ లేని సమయాన్ని చూసుకొని అక్రమంగా ప్రవేశించి ట్రాక్టర్ ఇంజన్లో ఇసుక నింపారని, దాంతో ట్రాక్టర్ డ్యామేజ్ అయి తనకు నష్టం వాటిల్లిందని పేర్కొంటూ ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు.