బాన్సువాడ, బతుకమ్మ : పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం బాన్సువాడలో అమరవీరులను స్మరిస్తూ బాన్సువాడ పట్టణ పోలీసులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. పట్టణ సీఐ తుల శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు.పోలీస్ స్టేషన్ నుండి ప్రారంభమైన ర్యాలీ బస్టాండ్ సమీపం లోని అంబేద్కర్ విగ్రహం కూడలి వరకు కొనసాగింది. పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నినాదాలు చేస్తూ అన్నిస్థాయులకు చెందిన పోలీసు అధికారులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు అయిన కార్యక్రమంలో పట్టణ సీఐ తుల శ్రీధర్ మాట్లాడుతూ పోలీసు అమరవీరుల త్యాగాలు వృధా కావని, వారి ఆశయాల సాధన కోసం నిరంతరం శ్రమిస్తున్నామన్నారు. ప్రజల ధన, మాన,ప్రాణాల రక్షణ కోసం రేయింబవళ్ళు కృషి చేస్తున్నామని చెప్పారు. అసాంఘిక శక్తులతో అలుపెరుగని పోరు సల్పి వీర మరణం పొందిన పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా నిలుస్తూ సమాజంలో శాంతి స్థాపన కోసం కృషి చేస్తున్నామని తెలిపారు.అన్ని వర్గాలకు చెందిన ప్రజలు తమ వంతు సహకారం అందిస్తూ పోలీసుల సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.