వెబ్ డెస్క్, బతుకమ్మ :
కాళేశ్వరంలోని ప్రసిద్ధ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో కాశీ నుండి విచ్చేసిన వేద పండితులచే గురువారం కర్పూర హారతి కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా కాశీ పండితులు వేద మంత్రో చ్చారణల మధ్య స్వామివారికి కర్పూర గౌర హారతిని సమర్పించగా, ఆలయ ప్రాంగణం భక్తుల రద్దీతో ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది. ఈ హారతి కార్యక్రమం భక్తులకు అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. వేదఘోషలు, మంగళ వాయిద్యాల నడుమ జరిగిన ఈ పూజా కార్యక్రమాన్ని వీక్షించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతూ పండుగ వాతావరణాన్ని తలపించాయి.

ఈ కార్యక్రమానికి ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి దర్శనం పొందారు. భక్తుల సౌకర్యార్థం తాగునీరు, క్యూలైన్ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు తదితర అన్ని సదుపాయాలను ఆలయ అధికారులు సమర్థవంతంగా కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు మాట్లాడుతూ, భక్తులు క్రమశిక్షణతో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలని సూచించారు. అలాగే శాంతి భద్రతలను పాటిస్తూ పూజా కార్యక్రమాలలో పాల్గొనాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం ద్వారా కాళేశ్వర క్షేత్ర ఆధ్యాత్మిక వైభవం మరింత వెలుగొందిందని, భక్తులలో భక్తి భావం మరింత పెంపొందిందని అధికారులు పేర్కొన్నారు. అనంతరం పూజారులు ఫణీంద్ర శర్మ కాశీ పండితులకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
