Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 February 2025, 7:10 pm Posted by : ramakrishna

పోలింగ్ సందర్భంగా ప్రచారం నిషేధం

  • 48 గంటలపాటు సైలెన్స్ పీరియడ్
  • ఎన్నికలు పూర్తయ్యే వరకు 144 సెక్షన్ అమలు
  • బల్క్ ఎస్ఎంఎస్ లు పంపడం నిషేధం
  • ఎన్నికల మార్గదర్శకాలు పాటించాలి
  • నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
  • రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్, బతుకమ్మ : ఈ నెల 27న జరిగే మెదక్ -నిజామాబాదు -కరీంనగర్ -ఆదిలాబాద్  పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో 48 గంటల నిశ్శబ్ద వ్యవధి (సైలెన్స్ పీరియడ్ )అమలులో ఉంటుందని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సైలెన్స్ పీరియడ్ లో భాగంగా 25.02.2025 సాయంత్రం 4.00 గంటల నుండి 27.02.2025 సాయంత్రం 4.00 గంటల వరకు బహిరంగ సభలు, ఊరేగింపులు సమావేశాలు నిర్వహించడం, ప్రచారం చేయడం, ఎలాంటి అభ్యంతకరమైన, రాజకీయపరమైన అంశాలతో కూడిన సంక్షిప్త సందేశాలు, బల్క్ ఎస్ఎంఎస్ పంపడంపై  ఎన్నికల సంఘం నిషేధం విధించడం జరిగిందని అన్నారు.  దీనిని దృష్టిలో పెట్టుకుని సైలెన్స్ పిరియడ్ లో ఎవరు కూడా రాజకీయపరమైన ఎస్.ఎం.ఎస్ లు, బల్క్ ఎస్ఎంఎస్ లను పంపకూడదని, బహిరంగ సభలు, ఊరేగింపులు, సమావేశాలు నిర్వహించకూడదని, ప్రచారం చేయరాదని కలెక్టర్ సూచించారు.  సోషల్ మీడియాలో వచ్చే సందేశాలను నిశితంగా పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. సైలెన్స్ పీరియడ్ లో నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే విచారణ జరిపి  ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951, ఎన్నికల ప్రవర్తనా నియమావళి 1961 ప్రకారం జారీ చేయబడిన సూచనలు,ఆదేశాల మేరకు బాధ్యులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.