- దశాబ్ధంకు పైగా స్టే వెకెట్ చేయించడంలో యంత్రాంగం విఫలం
- ప్రభుత్వ శాఖల సమన్వయలోపంతో టపాసుల విక్రయ దందా
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో ప్రమాదకర పరిస్థితుల్లో జరుగుతున్న పటాకుల విక్రయాల దందాపై జిల్లా అధికార యంత్రాంగం చోద్యం చూస్తుంది. రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా దీపావళి సమయంలో పటాకుల తయారి విక్రయాల వద్ద ప్రమాదాలు భయపెడుతున్నా జిల్లా అధికార యంత్రాంగంలో మాత్రం చలనం లేదు. ప్రధానంగా నిజామాబాద్ నగర నడిబొడ్డున కిసాన్ గంజ్ లో కోట్ల రూపాయల టన్నులకొద్ది పటాకుల విక్రయాల దందా హోల్ సేల్ గా జరుగుతుంటే అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రధానంగా అధికార యంత్రాంగం సమన్వయం చేయడంలో విఫలమౌతుంది. 2008లో కిసాన్ గంజ్ కు చెందిన ముగ్గురు, నలుగురు వ్యాపారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఎన్ వోసీపై స్టే తెచ్చుకున్నారు. దాదాపు 16 సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు సంబంధిత స్టేను వెకెట్ చేయించడంలో అధికార యంత్రాంగాలు వైఫల్యం చెందుతున్నాయి. పటాకుల దందా నిర్వాహణకు మున్సిపల్, ఫైర్, పోలీసు, రెవెన్యూ శాఖలు అనుమతులు ఇవ్వాల్సి ఉండగా కోర్టు స్టే పేరుతో దశాబ్ధాలుగా కోట్ల రూపాయల దందా ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టి జరుపుతున్నారు.

నాలుగు ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసి సంబంధిత స్టేను వెకెట్ చేయిస్తే లేదా ఎన్ వోసీ జారీ సమయంలో సంబంధిత వ్యాపారానికి అనుమతించకపోయినా సరిపోతుంది. కానీ అవేమి పట్టించుకోకుండా ప్రజలు ఆస్తులు, ప్రాణాలకు ఫణంగా పెట్టి జరుగుతున్న దందాపై ప్రతి యేడాది అధికార యంత్రాంగానిది చిన్నచూపే. ఇటీవల హైదరాబాద్ నడిబొడ్డున అబిడ్స్ లో నాలుగు దుకాణాలు అగ్నికి అహుతయ్యాయి. అయినప్పటికీ హోల్ సేల్ దందాపై యంత్రాంగానికి చిన్నచూపే మంగళవారం నిజామాబాద్ అగ్నిమాపక శాఖాధికారులు సంబంధిత దుకాణాలలో ఫైర్ సేఫ్టీ మేజర్స్ ఉన్నాయా లేదా అని తనిఖీలు నిర్వహించారు. కేవలం అగ్నిమాపక శాఖ అధికారులు మాత్రమే రావడంతో వ్యాపారులు పట్టించుకోలేదు. గతంలో తమ వ్యాపారాలను బైపాస్ కు మార్చామని చెప్పిన హోల్ సేలర్స్ కేవలం ఒక్క దీపావళి సీజన్ లోనే అమ్ముతున్నామని నమ్మిస్తున్నారు. మిగితా సమయంలో ఇతర వ్యాపారాలు చేస్తున్నామని చెబుతూ బురిడి కొట్టిస్తున్నారు. నిజామాబాద్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నర్సింగ్ రావు ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది తనిఖీలు నిర్వహించి సూచనలు చేయగా వారు అంతగా పట్టించుకున్నట్లు కనిపించలేదు.
