నిజామాబాద్, బతుకమ్మ : నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తాలో బుధవారం బీజేవైఎం ఆధ్వర్యంలో సీఎం దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పానుగంటి సతీష్ రెడ్డి మాట్లాడారు. హైదరాబాద్ లోని నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకుల దాడికి నిరసనగా డీసీసీ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. బిజెపి నాయకులు, కార్యకర్తలు అంటే చులకనగా చూస్తున్నారని, బిజెపి కార్యకర్తలు తలుచుకుంటే మీయొక్క భవనాలు కూల్చివేయడం ఎంతసేపు కాదని అన్నారు. తమకు సంస్కారం ఉందని, తమ పార్టీ అలాంటి దాడులు నేర్పలేదని అన్నారు. బీజేపీ నాయకులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఆ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యాదాల నరేష్, పల్నాటి కార్తీక్, జిల్లా బీజేవైఎం ప్రధాన కార్యదర్శి ఆమంద్ విజయ్ కృష్ణ, ఉపాధ్యక్షులు నాగ సురేష్, విపుల్ రావు, బీజేవైఎం నాయకులు అశోక్, రామకృష్ణ, దినేష్,మిగతా బీజేవైఎం కార్యకర్తలు పాల్గొన్నారు.
